Pages

Saturday, August 24, 2013

శరణు..శరణు..సాయి! సమర్థ సద్గురు సాయీ!

శరణు..శరణు..సాయి!
సమర్థ సద్గురు సాయీ! నీకు సాష్టాంగ నమస్కారం.
జీవ జంతువుల్లోనూ, జీవంలేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు.
పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకూ అంతా నువ్వే, అంతటా నువ్వే నిండి ఉన్నావు.
పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు...అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు.
సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు.
భక్తులందరూ నీకు సమానమే.
నీకు ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు.
నిన్నే సదా స్మరిస్తూ, నీ చరణారవిందాల చెంతనే సదా నిల్చుంది 'శరణు శరణు సాయీ!' అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు. మా జీవిత పరమావధిని నెరవేరుస్తావు.
"సంసారం మహాసముద్రం. దీనిని దాటటం చాలా కష్టం. విషయ సుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతూంటాయి. అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అలజడి రేపుతుంది. కోపం, అసూయ, ద్వేషాలనే మొసళ్లు నిర్భయంగా సంచరిస్తూంటాయి. మరోపక్క 'నేను', 'నాది' అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గిర్రున తిరుగుతూంటాయి. మంచితనం, వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతూంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేని తనం అనే చేపలు అక్కడక్కడా తిరుగాడుతూంటాయి."
ఇలాంటి మహాసముద్రమనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా, మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు. బాబా మహర్షులతో అగస్త్యుని వంటి వారు. అంగా, వ్యామోహాలు భౌతికవాంఛలపై ఆసక్తిని నశింపచేసే వారు.
బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు. సూర్యుడు జ్ఞానానికి సంకేతం. బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అలముకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.
బాబా లీలలు దీపస్తంభాలు. అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు.
"బాబా! మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు. మేము నిన్ను తప్ప మరేమీ కొరము. నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాం. నీ లీలల్ని సదా గానం చేస్తాం. మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు" అని ప్రార్థిస్తే బాబా మనల్ని చేయిపట్టి నడిపిస్తారు.

400th Parayana Instrustuctions

 
400th Parayana sat charitra

Shirdi Maze Pandharpur, Saibaba Ramaavar


సాయి చింతనలో - చింతలు దూరం....

సాయిబాబాలో సూర్యుని తేజస్సు కనిపిస్తుంది. చంద్రుని చల్లదనం అనుభూతికొస్తుంది. "సాయీ నువ్వే శరణం" అన్నవారిని వ్యామోహాల నుండి బయట పడేస్తాడు. సాయి చింతనతో ప్రశాంతత చేకూరుతుంది. చింతలు దూరమౌతాయి.వ్యాకులత తగ్గిస్తాడు. అజ్ఞానపు చీకటిని తొలగించి, జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడు. కష్టాల నుండి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తాడు.
సద్గురు సాయినాథునికి నమస్సుమాంజలులు. నువ్వే శరణని వేడినవారిని బాబా తప్పక ఆదుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుతాడు. అణువు నుండి పరమాత్మ వరకూ, సమస్త జీవరాశుల్లో సాయిబాబా వ్యాపించి ఉన్నాడని మనం విస్మరించకూడదు. మనోచక్షువుతో చూస్తే సాయి దర్శనం అవుతుంది. చింతలు దూరం చేసుకోడానికి, మనోభీష్టాలు నెరవేర్చుకోడానికి సాయి చింతనలో గడపాలి. కష్టం కలిగినప్పుడు, మనసుకు క్లేశం కలిగినప్పుడు బాబాను తలచుకుంటే, ఆయన్ను స్మరిస్తే మనసుకు నిశ్చింతగా ఉంటుంది.
సాయీ నువ్వే శరణం అని బాబామీద భారం మోపితే దుఃఖాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఆపదలు దూదిపింజల్లా తేలిపోతాయి. సాయిబాబా చింతనతో కష్టాలు తగ్గిపోవడం, దుఃఖాలు నశించడమే కాదు ప్రశాంతత చిక్కుతుంది. అహంకారం తొలగిపోతుంది. కామం, క్రోధం, ద్వేషం, అసూయ లాంటి అవలక్షణాలు నశిస్తాయి. మనోవికారాలు మాయమౌతాయి. సాయీ నువ్వే శరణం అనుకుంటే మనసులో అలజడులు, అల్లకల్లోలాలు తలెత్తవు. బాబా మనసును నిబ్బరంగా ఉంచుతాడు. సాయి చింతనలో చింతలు దూరమౌతాయి. జీవనగమనంలో హాయిగా ముందుకు సాగేలా చేస్తాడు.