Pages

Thursday, January 31, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము రెండవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

రెండవ అధ్యాయము

ఈ గ్రంథరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్ధతయు ధైర్యము; గొప్పవివాదము; హేమడ్ పంతు అను బిరుదు ప్రదానము; గురువుయొక్క యావశ్యకత.

ఈ గ్రంధరచనకు ముఖ్యకారణము

మొదటి యధ్యాయములో గోధుమలను విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీసాయి యొక్క యితర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింతలీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను బోగొట్టును గదా యని భావించి బాబాయొక్క పవిత్ర జీవితమును, వారి బోధలును వ్రాయ మొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమునైన మార్గమును జూపును.

పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము

ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థతగలవాడను కానని హేమడ్ పంతు అనుకొనెను. అతడిట్లనియెను. "నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిగాని యోగి యొక్క జీవితమును గ్రహించ జాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను. సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహుకష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియును. నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహముకొరకు ప్రార్థించితిని."

మహారాష్ట్రదేశములోని మొట్టమొదటికవియు, యోగీశ్వరుడు నగు జ్ఞానేశ్వరమహారాజు యోగులచరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగు లనేక మార్గముల నవలంబించెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శ క సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతని ప్రోత్సాహించి, కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శ క సంవత్సరములో దాసగణుయొక్క సేవను ఆమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్తవిజయము, సంతవిజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగణు వ్రాసినవి భక్తలీలామృతమును సంతకథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీనియందు గలవు. భక్తలీలామృతములోని 31, 32, 33, అధ్యాయములందును, సంతకథామృతములోని 57వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంచికలు 11, 12 సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసియగు సావిత్రి బాయి రఘునాథ్ తెండుల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింవబడినవి. దాసగణు మహారాజుగారు కూడ శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవాని మెహతా యను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించియున్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సత్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును? దాని యవసరమేమి? యని ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రమువలె విశాలమైనది; లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్ట వచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యము కలుగజేయును. అవి మనోవికలత పొందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములు ఉపదేశకములునునగు బాబా ప్రబోధలు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావిణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగజేయును. అందుచేత బాబాగారి యాత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా యహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నేను నా యంతట ఈ గ్రంథరచనకు బాబా యెక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున మాట్లాడుమంటిని. నా తరవున వారు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనముచే జీవించు ఫకీరును నేను, నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేదని యనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీయొక్క యనుమతి యాశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము." సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు నిట్లు చెప్పదొడంగెను. "కథను, అనుభవములను, ప్రోగు చేయుమను. అక్కడక్కడ కొన్ని ముఖ్యవిషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసెదను. వాడు కారణమాత్రుడే కాని నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడెదను. వారి జీవిత చర్యలకొరకే కాదు. సాధ్యమైనంతవరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడ లేకుండనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచినదానినే నీవు నిర్థారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల యభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు."

వివాదమనగనే నన్ను హేమడ్ పంతు అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. దానినే మీకు చెప్పబోవుచున్నాను. కాకా సాహెబు దీక్షిత్, నానా సాహెబు చాందోర్కరులతో నే నెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్య నేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లొనావ్లాలో నున్న నా స్నెహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగించెను గాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని "నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువుయొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ యేల పోవలెను?" అని భావించి షిరిడీ ప్రయాణమును ఆపితిని. కాని కానున్నది కాక మానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి, వసాయీకి పోవు చుండెను. ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసాయీ పోవు బండి కొరకు కనిపెట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేయుటవల్ల నాపై కోపించెను. నానా చెప్పినది, వినోదముగను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీపోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకొని షిరిడీ బయలుదేరితిని. దాదరు వెళ్ళి యచ్చట మన్నాడ్ మెయిలుకొరకు వేచి యుంటిని. బండి బయలుదేరునప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నియు జూచి యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యా లోచన వారికి చెప్పితిని. వెంటనే బోరీ బందరు స్టేషనుకు బోవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవుబండి దాదరులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగ కుండినచో నే ననుకొనిన ప్రాకారము ఆ మరుసటి ఉదయము షిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములుకూడ కలిగి యుండును. కాని యది యట్లు జరుగలేదు. నా యదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9, 10 గంటలలోగా షిరిడీ చేరితిని. నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సాఠేవాడ యొక్కటియే వచ్చుభక్తులకొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యా సాహెబు నూల్కరు అప్పుడే మసీదునుండి వచ్చుచు బాబా వాడాచివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళీదర్శనము చేయమని సలహా యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. ఆనందము పొంగిపొరలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సునకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్పమార్పుకలిగెను. నన్ను షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన నానాసాహెబును నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమువల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యాలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మసుకృతముచే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచ మంతయు సాయిబాబా రూపము వహించెను.

గొప్ప వివాదము

నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలా సాహెబు భాటేకును గురువుయొక్క యావశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మనుండి తప్పించుకొనవలెను. ఏమీచేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించితిని. భాటే యింకొక మార్గము బట్టి ప్రారబ్దము తరపున వాదించుచు "కానున్నది కాకమానదు. మహనీయులుకూడ నీ విషయములో నోడిపోయిరి. మనుజు డొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివి తేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని నీకు తోడ్పడవు" ఈ వాదన యొక గంటవరకు జరిగెను. కాని యిదమిత్థమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీరస్పృహ, అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూలకారణ మహంకారము.

ఇతరులతో కూడ మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి యిట్లడుగ దొడంగెను. "సాఠేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్ పంతు ఏమని పలికెను?"

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడ మసీదునకు చాల దూరముగ నున్నది. మా వివాదమునుగూర్చి బాబాకెట్లు దెలిసెను? అతడు సర్వజ్ఞూడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నధికారియై యుండవచ్చును.

హేమడ్ పంతు అను బిరుదునకు మూలకారణము

నన్నెందుకు హేమడ్ పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రిపంతు అను నామమునకు మారు పేరు. దేవగిరి యాదవ వంశమున బుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తియను గొప్పగ్రంధములను రచించినవాడు; మోడి భాషను కని పెట్టినవాడు. క్రొత్తపద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. మేధాశక్తి యంతగా లేనివాడను. నా కెందుకీబిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నే నెప్పుడును అణకువనమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరిక యయి యుండవచ్చుననియు గ్రహించితిని. వివాదములో గెలిచనందులకు బాబా యీ రీతిగా తెలివికి అభినందనము లిచ్చియుండునని యనుకొంటిని.

భవిష్యచ్చరితనుబట్టి చూడగా బాబా పలుకులకు (దభోల్కరును హేమడ్ పంతు అనుట) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తును తెలిసియే యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్ పంతు శ్రీసాయిసంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగ నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను.

గురువుయొక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమడ్ పంతు వ్రాసియుండలేదు. కాని కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమునుగూర్చి తాను వ్రాసికొనిన దానిని ప్రకటించెను. హేమడ్ పంతు బాబాను కలసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా యని యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. ఎవరో, యెక్కడకు అని యడుగగా, చాల పైకి అని బాబా చెప్పగా, మార్గమేది యని యడిగిరి. "అక్కడకు పోవుటకు అనేకమార్గములు కలవు. షిరిడీనుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల" వని బాబా బదులిడెను. కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో నని యడుగగా, నట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడ వచ్చును. లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. దభోళ్కరు అచ్చటనే యుండుటచే తన ప్రశ్న కిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంతవిషయములలో మానవుడు స్వేచ్ఛాపరూడా కాడా? యను వివాదమువలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా, పరమార్థము గురుబోధలవల్లనే చిక్కుననియు రామకృష్ణులు వసిష్ఠ సాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
రెండవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

శ్రీ సాయి సత్ చరిత్రము మొదటి అధ్యాయము


 సాయి సత్ చరిత్రము
మొదటి అధ్యాయము

ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

మొదటి అధ్యాయము

గురు దేవతా స్తుతి – బాబా గోధుమలు పిండి విసిరిన కథ – దాని తత్త్వము. పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీ సాయిసత్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు.

ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు.

పిమ్మట శ్రీసరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు.

తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.

తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆభూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.

అటుపిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొ||న పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడ ప్రార్థించెను.

తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.

అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్ధించెను.

చివరగా తన గురువు, దత్తావతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి, తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికిని నమస్కరించెను.

పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట, హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను.

1910 సం|| తదుపరి యొకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులో నున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులు పైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను, “ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును? ఆయనెందుకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే! వారికి గోధుమపిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!” యని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నిట్లే యాశ్చర్యమగ్నులయిరి. కాని మాలోనెవరికి గూడ బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలిపిడిని చేతపట్టుకొని, బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిఱునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. “బాబాకు ఇల్లుపిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని? బాబా మిగుల దయార్ద్రహృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు.” ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసరుట ముగించి, పిండిని నాలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి. అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.

“ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నంచుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు.” అది విని యా వనిత లాశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి, గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా యాజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి.

నేనిదంతయు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందించిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూడార్ధమును తెలిసికొన కుతూహలము కలిగెను. గోధుమపిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను జూచి యిట్లు భావించుకొని హృదయానందపూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సత్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంధము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.

తిరగలి విసురుట – దాని వేదాంత తత్త్వము

తిరుగలి విసరుటను గూర్చి షిరిడీ ప్రజలనుకొనురీతియే కాక దానిలో వేదాంత భావము కూడ కలదు. సాయిబాబా షిరిడీ యందు షుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే యుండురి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీదిరాయి భక్తి; చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని, ఆత్మసాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును.

ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను: “నేను కూడ ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?” దానికి నిపతినిరంజనుడిట్లు బదులు చెప్పెను:

“భయములేదు! తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. అంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు.”

ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
మొదటి అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|